కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) లోని అలుగునూర్ వంతెన సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) విషాదాన్ని మిగిల్చింది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని వేగంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మృతుడిని బీహార్కు చెందిన మహమ్మద్ ఉజాలా (20)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారు గజ్వేల్ నుంచి ధర్మారం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరంతా పెద్దపల్లి జిల్లా ధర్మారం, కటికనపల్లి ప్రాంతాల్లో నివసించే కూలీలుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

