కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ (Necklace Road) పీపుల్స్ ప్లాజాలో ‘సమ్మర్ ఉత్సవ్ మేళా’ (Summer Utsav Mela) ప్రారంభమైంది. సినీ నటుడు అలీ సతీమణి జుబేదా ఈ ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ మేళాలో ప్రధానంగా ఫిలిప్పీన్స్ మహిళలు ప్రదర్శిస్తున్న ‘జలకన్యల లైవ్ షో’ విజిటర్స్ను మంత్రముగ్ధులను చేస్తోంది. వీటితోపాటు ప్యారిస్ ప్రతీక ఐఫిల్ టవర్, మ్యూజికల్ ప్యాలెస్ సెట్టింగ్లు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేసవి వినోదాన్ని పంచే ఈ మేళా ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
కాగా భానుడి భగభగలకు చెక్ పెడుతూ నగరవాసులకు ‘సమ్మర్ ఉత్సవ మేళా’ మంచి అనుభూతులను అందిస్తోంది. ఈ మేళాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న ‘అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం’ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. వందలాది రకాల అరుదైన చేపలను అతి దగ్గరగా చూసే అవకాశం కల్పించడంతో పిల్లలు, పెద్దలు భారీగా తరలివస్తున్నారు.

