కలం, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ (Regonda) మండల కేంద్రంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, శుక్రవారం రాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులతో శ్రావణ్కు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
అనంతరం అతనిపై కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

