కలం, హనుమకొండ: ఈజీ మనీ కోసం కేటుగాళ్ళు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఓ వ్యాపారి బలహీనతను ఆసరాగా చేసుకున్న దొంగ ఎంతో చాకచక్యంగా అతడి స్కూటీతో ఉడాయించిన ఘటన హనుమకొండ (Hanumakonda) జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
అసలేం జరిగింది ..?
హనుమకొండ జిల్లా కేంద్రం నక్కలగుట్టలోని ఒక స్వీట్ షాప్ నడిపిస్తున్న యజమానిని ఓ గుర్తు తెలియని వ్యక్తి కలిశాడు. మీ షాప్ కి దగ్గరలోనే నాకు ఆఫీస్ ఉందని, ప్రతిరోజూ 250 కప్పుల టీ సరఫరా చేయాలంటూ ఒక పెద్ద ఆర్డర్ ఆశ చూపించాడు. ఆ వ్యక్తి మాటలు వాస్తవమే అని నమ్మిన స్వీట్ షాప్ యజమాని డీల్ ఓకే చేసుకున్నాడు. తీరా ఆర్డర్ ఖరారయ్యాక, “మా ఆఫీస్ ఎక్కడుందో చూపిస్తాను రండి” అంటూ సదరు వ్యక్తి నమ్మబలికాడు. దీంతో ఆ యజమాని తన స్కూటీని సదరు వ్యక్తికి ఇచ్చి భార్య, కుమారుడిని ఆఫీస్ చూసి రమ్మని పంపించాడు.
స్కూటీతో జంప్..!
స్వీట్ షాప్ యజమాని భార్యాపిల్లలను స్కూటీపై ఎక్కించుకెళ్లిన ఆ మాయగాడు ముందే సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారం వారిద్దరిని వేర్వేరు ప్రాంతాల్లో దించేశాడు. ఆ తర్వాత ఆఫీస్ చూపించకుండా, యజమానికి సంబంధించిన స్కూటీతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఎంతసేపటికీ అపరిచితుడు రాకపోవడంతో అటు భార్యాపిల్లలు వేర్వేరు చోట్ల ఉండిపోయారన్న విషయం తెలుసుకున్న స్వీట్ షాప్ ఓనర్ మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీటివి ఫుటేజీల ఆధారంగా స్కూటీ చోరీ చేసిన మాయగాడి కోసం గాలిస్తున్నారు.

