కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నకిలీ సర్టిఫికెట్ల బదిలీల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ‘స్పౌజ్ కోటా’ (జీవిత భాగస్వామి ఉద్యోగ నిబంధన) కింద బదిలీ ప్రయోజనం పొందారంటూ ఓ ఏఎన్ఎం కలెక్టర్కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. డీఎంహెచ్ఓ ఆఫీస్ సూపరింటెండెంట్పై ఆరోపణలు చేస్తూ ఏఎన్ఎం ఐ. సుజాత ఈ మేరకు నల్లగొండ (Nalgonda) కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన బదిలీల కౌన్సెలింగ్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఒక మహిళా ఉద్యోగిని అసలు సర్వీస్ రికార్డుల్లో ఎలాంటి జీవిత భాగస్వామి వివరాలు లేకపోయినప్పటికీ.. అధికారులను తప్పుదోవ పట్టించి నకిలీ ‘స్పౌజ్’ సర్టిఫికెట్ సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగానే సదరు ఉద్యోగిని నకిరేకల్కు బదిలీ (పోస్టింగ్) సాధించారని, దీని వెనుక కార్యాలయ సూపరింటెండెంట్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కుంభకోణంలో నిజానిజాలు బయటకు రావాలంటే సదరు ఉద్యోగినికి సంబంధించిన కీలక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. అర్హులైన బదిలీదారులకు అన్యాయం చేస్తూ, అక్రమ మార్గాల్లో పోస్టింగులు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం సుజాత కోరారు. విచారణలో ఈ అవకతవకలు గనుక నిజమని రుజువైతే.. సదరు సిబ్బందిపై తెలంగాణ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్), తెలంగాణ సీసీఏ నిబంధనల ప్రకారం తక్షణమే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ బదిలీల వ్యవహారంపై ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా వైద్యశాఖలో పేరుకుపోయిన అవినీతి తిమింగలాలను బయటకు లాగాలని బాధితులు, తోటి ఉద్యోగులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

