కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్(Nizamabad) జిల్లాలో దొంగనోట్లు ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక రైతు లోన్ కట్టేందుకు దొంగ నోట్లు తీసుకురావడంతో ఈ విషయం వెలుగు చూసింది. వర్ని మండల కేంద్రంలోని ఒక బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు ఇటీవల జలాల్పూర్కు చెందిన రైతు చిన్న సాయిలు రూ. 2,08,500 నోట్లు తీసుకొచ్చాడు. దొంగ నోట్లుగా గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో దొంగనోట్ల రాకెట్(Fake Currency Racket) గుట్టు రట్టు అయ్యింది.
పాలమూరు జిల్లాకు లింక్
నోట్ల తయారీ, చలామణి ముఠాలో (Fake Currency Racket) మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన రవికుమార్ రెడ్డిని ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ కేసులో పుణెకు చెందిన ఆకాశ్ రమేశ్, మహాదేవ్, నిజామాబాద్ జిల్లా వర్ని మండలం ఆఫందీ ఫారం గ్రామానికి చెందిన పాల్యా కళ్యాణ్, జలాల్ పూర్కు చెందిన నరెడ్ల శంకర్, రవి, నరెడ్ల బాలయ్య, కోటయ్య క్యాంపునకు చెందిన సటోజీ గోపాల్ను నిందితులుగా గుర్తించారు. తొలుత ముఠాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్పిన సమాచారం ఆధారంగా మరో ఆరుగురిని అరెస్టు చేశారు.
దొంగ నోట్ల దందా సాగిందిలా..
రవికుమార్ రెడ్డి, ఆకాశ్ రమేశ్ కొద్దిరోజుల క్రితం రూ.4 లక్షల నకిలీ నోట్లను ముద్రించి వికారాబాద్ వెళ్లారు. అక్కడ వీలైనన్ని చలామణి చేశారు. ముఠాలో ఒకడైన శంకర్ మిగిలిన రూ.2.08 లక్షలను తన గ్రామానికే చెందిన బంధువు చిన్న సాయిలు ఇంట్లో ఆయనకు తెలియకుండా పెట్టాడు. ఆ వ్యక్తి దొంగనోట్లను బ్యాంకులో రుణం తీర్చేందుకు తీసుకెళ్లగా గుట్టురట్టయ్యింది. కేసు విచారణలో ఉండగా.. మరోవైపు ఆకాశ్ రమేశ్, రవికుమార్ రెడ్డి రూ.9.86 లక్షల నకిలీ నోట్లను ముద్రించారు. వాటిని హైదరాబాద్కు తీసుకెళ్తుండగా బోధన్ బస్టాండ్లో పట్టుకున్నట్లు వర్ని ఎస్సై తెలిపారు. నిందితుల నుంచి కారు, రెండు ప్రింటర్లు, ల్యాప్ టాప్, మూడు సెల్ఫోన్లు ఆకుపచ్చ పేపరు, ఇతర ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రవికుమార్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన ఎనిమిది మంది నిందితులను నిజామాబాద్ పోలీసులు రిమాండ్కు తరలించారు.
Read Also: చంద్రునిపై అణువిద్యుత్ కేంద్రం నిర్మించనున్న రష్యా!
Follow Us On: Pinterest


