కలం, వెబ్ డెస్క్: మహిళా క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంపై ప్రముఖ పిస్టల్ షూటర్ ఈషా సింగ్ (Esha Singh) ప్రశంసల వర్షం కురిపించారు. క్రీడల్లో మహిళలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీసుకుంటున్న చొరవలు అద్భుతమని ఆమె కొనియాడారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, మహిళా అథ్లెట్లకు ఇంతలా గుర్తింపు ఇవ్వడం చాలా గొప్ప విషయమని, దేశానికి ఇలాంటి నాయకుడు దొరకడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) వంటి ప్రభుత్వ పథకాల వల్ల ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, ఆర్థిక సాయం అందుతున్నాయని ఆమె తెలిపారు.
గడిచిన కొద్ది రోజులుగా క్షేత్రస్థాయి నుంచి అందుతున్న నిధుల వల్ల క్రీడల్లో మహిళల భాగస్వామ్యం భారీగా పెరిగిందని ఈషా సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంతోమంది మహిళలు ఆటల్లోకి వస్తున్నారని చెప్పారు. మహిళా అథ్లెట్లకు కొన్ని ప్రత్యేక సవాళ్లు ఎదురైనప్పటికీ, తామేమీ పురుషుల కంటే తక్కువ కాదని స్పష్టం చేశారు. మహిళలు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలరని చెబుతూ తోటి క్రీడాకారిణులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) షూటింగ్ ప్రపంచకప్లో ఈషా సింగ్ సరికొత్త ప్రపంచ రికార్డుతో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకం సాధించారు. ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నారు. ఈ అనుభవంపై ఆమె మాట్లాడుతూ.. ఆటల్లో ఎంత అనుభవం ఉన్నా ఒత్తిడి మాత్రం ఒకేలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పోటీ స్థాయి పెరిగేకొద్దీ ఆట మరింత కఠినంగా మారుతుందని చెప్పారు. అయితే మ్యూనిచ్ రేంజ్లో తనకు ఇది మూడోసారి కావడం వల్ల అక్కడ ఆడటం కొంత సులువైందని, శిక్షణలో నేర్చుకున్న విషయాలను మైదానంలో సరిగ్గా ప్రదర్శించగలిగానని వివరించారు.
రాబోయే ఆసియా గేమ్స్ వంటి పెద్ద టోర్నమెంట్ల సన్నద్ధతపై కూడా ఈషా సింగ్ మాట్లాడారు. టోర్నీ పేరును బట్టి తాను ప్రిపరేషన్ మార్చుకోనని స్పష్టం చేశారు. షూటింగ్ అనేది పూర్తిగా మానసికమైన ఆటని, తలలో ఉండే ఆలోచనలను నియంత్రించుకోవడమే ఇందులో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా దేశం కోసం మరిన్ని పతకాలు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఈషా సింగ్ ముగించారు.

