కలం, వెబ్డెస్క్: రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) విమర్శించారు. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మొక్కజొన్న రైతులకు మద్దతుగా వరంగల్ జిల్లా రాయపర్తిలో ఎర్రబెల్లి రోడ్డెక్కారు. రైతులతో కలిసి రాయపర్తి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునే వరకు ధర్నా ముగించే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి దయాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాగా, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల వరంగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సందర్శించి రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వకపోగా, రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనడం లేదని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు.

