కలం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం (Cabinet meeting) సోమవారం జరగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ భేటీలో ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన అంశాలతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టులపైనా లోతుగా చర్చ జరిగే అవకాశమున్నది. ఉద్యోగులు ప్రస్తావించిన డిమాండ్లకు ఇప్పటికే పరిష్కారం సూచించడంతో ఆర్థికపరమైన అంశాలు, నిర్దిష్ట కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రభుత్వం విడుదల చేయనున్న వన్ టైమ్ ఇన్స్టాల్మెంట్, పెండింగ్ బిల్లుల బకాయిల పేమెంట్, ఆరోగ్య భద్రత కార్డుల జారీ తదితర ముఖ్యమైన అంశాలపై విధాన నిర్ణయం జరగనున్నది. దీనికి తోడు ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టడంపై హైదరాబాద్ ఐఐటీ, ఆర్వీ అసోసియేట్స్ సమర్పించిన నివేదికలపై ఇప్పటికే చర్చించిన ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి యాక్షన్ ప్లాన్ను రూపొందించారు. దీనిపై క్యాబినెట్ భేటీలో క్షుణ్ణంగా చర్చ జరగనున్నది.

