కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో అర్హులైన యువతీ, యువకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ (PM Internship) పథకం ద్వారా శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన అధికారి, మై భారత్ సంగారెడ్డి కేంద్ర అధికారి ఎం. రంజిత్ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యువతకు వృత్తిపరమైన పని అనుభవాన్ని అందించేందుకు ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభించబడిందని ఆయన పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,000 స్టైపెండ్తో పాటు ఒకేసారి రూ.6,000 జాయినింగ్ గ్రాంట్ అందించనున్నట్లు తెలిపారు. 6 లేదా 9 నెలల ఇంటర్న్షిప్ (PM Internship) పూర్తైన తర్వాత దేశంలోని ప్రముఖ కంపెనీలలో ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కూడా ఉంటుందని ఆయన వివరించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఆసక్తి రంగాన్ని బట్టి మై భారత్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కార్యక్రమ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9963056730 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
Read Also: ఆర్టీసీ సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత.. ఒంటికి నిప్పంటించుకుని డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
Follow Us On: X(Twitter)

