కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె (TGSRTC Strike) ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండో రోజు కూడా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన నిరసన ప్రదర్శన విషాదంగా మారింది. అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ ఒక డ్రైవర్ అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం సంచలనంగా మారింది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.
నర్సంపేటలో ఉద్రిక్తత
నర్సంపేట బస్సు డిపో వద్ద గురువారం తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె (TGSRTC Strike) చేపట్టారు. ఇందులో భాగంగా డిపో గేటు ముందు భారీ ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలో పాల్గొన్న డ్రైవర్ శంకర్ గౌడ్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో తోటి కార్మికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేసి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను శాంతింపజేస్తున్నారు. ముందస్తు చర్యగా డిపో వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల వేధింపులు, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఆర్టీసీ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడినట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నాయి.
Read Also: నేపాల్ లో మళ్లీ నిరసనలు.. ఇద్దరు మంత్రులు రాజీనామా!
Follow Us On : WhatsApp

