కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సర్ (Telangana SIR) ప్రక్రియ గడువు పొడిగింపుపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సర్ గడువును ఆగస్ట్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో జూలై 14వ తేదీకి సర్ గడువు ముగిసింది. కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాక పోవడంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని గడువును పొడిగించారు.
దీనికి సంబంధించిన షెడ్యూల్ను నేడు ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 1, 2026 నాటికి అర్హత కలిగిన ఓటర్లను ప్రాతిపదికగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియ జరగనుంది. జూన్ 25 నుండి ఆగస్టు 3 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే కొనసాగుతుంది. అనంతరం ఆగస్టు 3న పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి చేసి, ఆగస్టు 10వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారికంగా విడుదల చేస్తారు.
ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకు ప్రజలకు అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలించి అక్టోబర్ 8 లోగా పూర్తిస్థాయిలో పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.


