కలం, వెబ్ డెస్క్ : దేశంలోని 24 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం (Rajya Sabha Elections) కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు స్థానాల చొప్పున ఎన్నికలు జరగనుండగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మూడు , జార్ఖండ్లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జూన్ 9న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణ కోసం జూన్ 11 వరకు ఎన్నికల సంఘం సమయం కేటాయించింది.
జూన్ 18న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. రాజ్యసభ ఎన్నికల మొత్తం ప్రక్రియ జూన్ 20 నాటికి పూర్తికానుంది. ఏపీలోని పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ ల పదవీకాలం ఈ నెల 26 తేదీ నాటికి పూర్తి కానుంది. ఈ నాలుగు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తున్నారో అనే విషయాన్ని అధికార కూటమి ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

