కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వేసవి కాలాన్ని మించిపోయేలా భారీ విద్యుత్ డిమాండ్ (Telangana Power Demand) నెలకొన్నది. దక్షిణ డిస్కం పరిధిలో పీక్ సమ్మర్లో 9 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటే ఇప్పుడు వర్షాకాలంలో దాన్ని దాటిపోయి 10,839 మెగావాట్ల అదనపు డిమాండ్ ఏర్పడింది. గతేడాది ఆగస్టు 12న 7,216 మెగావాట్ల డిమాండ్ ఉంటే ఈసారి అదే రోజున 3,623 మెగావాట్ల మేర ఎక్కువ అవసరం ఏర్పడింది.
రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాల్లేకపోవడంతో వ్యవసాయ అవసరాలకు బోరు బావులపై ఆధారపడి మోటారు పంపుసెట్లు ఎక్కువగా వినియోగించడం.. ఇలాంటివన్నీ విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమని దక్షిణ డిస్కం అధికారులు పేర్కొన్నారు. అందుకే గతేడాది 147.12 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే ఈసారి అదే రోజున 207.30 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ‘క్యూర్’ పరిధిలో 3,920 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా గతేడాది ఇదే రోజున 3,310 మెగావాట్లుగా ఉంది. విద్యుత్ వినియోగం 65.49 మిలియన్ యూనిట్ల నుంచి 81.17 మిలియన్ యూనిట్లకు పెరిగింది.

