కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నటీనటులపై వేధింపులు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు అసభ్యంగా కామెంట్లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె బుధవారం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక ఫోటోపై ఓ వ్యక్తి అత్యంత అసభ్యకరంగా కామెంట్స్ చేశాడు. ఆ వ్యక్తి ప్రవర్తన మితిమీరడంతో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల కింద అసభ్య పదజాలంతో దూషిస్తూ తన గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఈషా రెబ్బా (Eesha Rebba) ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న నెటిజన్ను గుర్తించి శిక్షించాలని కోరారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సైబర్ క్రైమ్ విభాగం సాయంతో నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ఇష్టానుసారంగా కామెంట్స్ చేసే వారికి ఈ ఫిర్యాదు ఒక హెచ్చరికలా మారుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also: సింగిల్ పార్ట్గా ‘వారణాసి’.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్
Follow Us On: X(Twitter)


