కలం మెదక్ బ్యూరో: ప్రసిద్ధ ఏడుపాయల జాతర(Edupayala Jatara) నేటి నుండి ప్రారంభం అవుతుంది. మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా మెదక్((Medak)) జిల్లా పాపన్న పేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి అలయం దగ్గర మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఏడుపాయల జాతర జరుగుతుంది. జాతర కోసం లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహరాష్ట్ర నుండి తరలివస్తారు. ఈసారి ఏడుపాయల జాతర నేడు ప్రారంభం అయ్యి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. నేడు మహా శివరాత్రి వేడుకలు, రేపు 16 బండ్ల ఊరేగింపు, 17న రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు…
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. మూడు రోజులు జాతర నిర్వహణకు ఏ ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల జాతర సందర్భంగా ఎక్కువ బస్సు సర్వీసులు నడపడంతో పాటు, భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు అపరిశుభ్రం కాకుండా మూడు షిఫ్ట్లో పారిశుద్ధ్య కార్మికులను విధులలో అందుబాటులో ఉంచారు. జాతర సందర్భంగా వైద్య క్యాంపులు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమైన ప్రదేశాలలో అన్ని పందిళ్ల వద్ద మంటలు ఆర్పే ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చిన భక్తులు ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టులో పుణ్య స్నానాలు చేస్తారు కాబట్టి 150 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
సమన్వయంతో పని చేయాలి
జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారుల నోడల్ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు భక్తుల కోసం ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. జాతరలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల సమస్య లేకుండా సజావుగా సాగడానికి 829 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు సాగే ఏడుపాయల జాతర వేడుకలను ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు ఇబ్బందులు లేకుండా అత్యంత వైభవంగా ఏడుపాయల జాతర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జాతర సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. నేడు జాతర ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.


