కలం, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచోట్ల ఎబోలా వైరస్ భయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే విజయవాడ ఎయిర్పోర్టు (Vijayawada Airport)లో ప్రత్యేకంగా ఎబోలా స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
తాజాగా సింగపూర్ నుండి వచ్చిన ఒక విమానంలోని ప్రయాణికులకు వైద్య బృందం పూర్తిస్థాయిలో ఆరోగ్య తనిఖీలు నిర్వహించింది. మొత్తం 185 మంది ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించి, వారి ఆరోగ్య పరిస్థితిని నమోదు చేసుకున్నారు. ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు సంబంధించి అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. విదేశీ ప్రయాణికుల రాకపోకలపై గన్నవరం విమానాశ్రయ ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు.

