కలం, వెబ్ డెస్క్ : గోదావరి నది కాలుష్యంపై (Godavari River Pollution) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా తెలుగు తల్లి” గేయంలోని “గోదావరి, కృష్ణమ్మల గలగలలు” అన్న పదాలను ఇప్పుడు “గోదావరి, కృష్ణమ్మ వెలవెల” అని పాడాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. నదుల పరిరక్షణలో ప్రభుత్వాలు, పరిశ్రమలు విఫలమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్ మిల్ నుంచి వెలువడుతున్న కలుషిత నీరు గోదావరిలో కలుస్తోందని, ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య అని పవన్ పేర్కొన్నారు. సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆయన కాలుష్య నీరు కలిసే ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించిన అనంతరం నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు.
పర్యావరణ నిబంధనలు పాటించకుండా పరిశ్రమలు వ్యవహరిస్తున్నాయంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వంటి పవిత్ర నదిని కలుషితం చేయడాన్ని సహించబోమని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నదుల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, కాలుష్యానికి కారణమైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

