కలం, వెబ్ డెస్క్: ప్రపంచ వేదికలపై క్రీడల రంగంలో భారత్ గొప్ప పాత్ర పోషిస్తుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) కొనియాడారు. ఖేలో ఇండియా పేరుమీద దేశవ్యాప్తంగా నేడు యువత క్రీడల మీద దృష్టి పెట్టారని చెప్పారు. చిన్న పిల్లలు సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లతో ఆడుకోకుండా ఫుట్ బాల్, కబడ్డీ, క్రికెట్ లాంటివి ఆడాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమయం ఖచ్చితంగా ఇవ్వాలని తల్లిదండ్రులను, స్కూల్ యాజమాన్యాలను కోరుతున్నామని చెప్పారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ – 2026 (Summer Coaching Camp) ముగింపు ఉత్సవాల్లో ఈటల పాల్గొన్నారు. విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. క్యాంపులో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కాలంలో పిల్లలకు పొద్దున్నుంచి రాత్రి దాకా చదువు తప్ప ఇంకొకటి ఉండట్లేదని అన్నారు. చదువు ఒక్కటే ఉంటే సరిపోదని.. అది సంపూర్ణత్వం ఇవ్వదని చెప్పారు. విద్యార్థికి తనకాళ్ళ మీద తను నిలబడేలా విద్య ఉండాలి తప్ప.. మార్కులే పరమావధి కాకూడదని హితవు పలికారు. అన్నిటినీ తట్టుకొని నిలబడే మానసిక స్థైర్యం అందించేవి క్రీడలు అని చెప్పారు. ప్రభుత్వంతో పాటు అనేక మంది క్రీడాభిమానులు కలిసి ఈ క్యాంప్ నిర్వహించారని అన్నారు. కోచింగ్ ఇచ్చిన టీచర్లకు, ఓపికగా తీసుకువచ్చిన తల్లిదండ్రులకు, నిర్వాహకులకు, అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. క్రీడలను ప్రోత్సహిద్దామని.. మంచి విద్యార్థులను తయారు చేద్దామని పిలుపునిచ్చారు.

