కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో గంజాయి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఈగల్ టీమ్(Eagle Team)ను ఏర్పాటుచేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. తాజాగా హైదరాబాద్లో ఈగల్టీమ్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. నానక్రామ్గూడలో కిరాణా షాపు ముసుగులో గంజాయి విక్రయాలు నిర్వహిస్తుండగా పక్కా స్కెచ్వేసి అదుపులోకి తీసుకున్నది. మొత్తం 50 మందిని ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
నీతుబాయ్ అనే మహిళ నానక్రామ్గూడలో కిరాణా దుకాణం ముసుగులో గంజాయి దందా చేస్తోంది. ఈమె గతంలో గంజాయి దందా చేస్తూ పోలీసులకు పట్టుబడింది. పీడీ యాక్ట్ కూడా నమోదైంది. జైలు నుంచి విడుదలైన అనంతరం నీతుబాయ్ మళ్లీ పాత దందాను మొదలుపెట్టంది. దీంతో ఈగల్ ఫోర్స్ పక్కాగా స్కెచ్ వేసి నీతు బాయ్ని అదుపులోకి తీసుకున్నది. బుధవారం మధ్యాహ్నం ఐటీ ఉద్యోగులు గంజాయి కోసం నీతుబాయ్ ఇంటికి చేరుకొని గంజాయి కోసం క్యూ కట్టారు. ఈ క్రమంలో అక్కడ మాటు వేసి ఉన్న ఈగల్ టీమ్ (Eagle Team) వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది.
నీతుబాయ్ ప్రతి రోజు 5 లక్షల నుంచి 10 లక్షల విలువైన గంజాయిని విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. గంజాయి దందాపై ఈగల్ టీమ్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 50 మంది ఐటీ ఉద్యోగులతో పాటు మరికొంతమందిని కూడా ఈగల్ అధికారులు అరెస్ట్ చేశారు. నగరంలోని వివిధ ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న కొందరు యువకులు ఈ నెట్వర్క్ ద్వారా గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. దాడుల్లో భారీసంఖ్యలో మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
Read Also: రౌడీలతో నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ.ఆనంద్
Follow Us On: Instagram

