కలం, మెదక్ బ్యూరో: కళ్ల ముందే నీళ్లున్నా.. పంట పొలాలు తడవని పరిస్థితి. దుబ్బాక (Dubbaka) ప్రాజెక్టుల కోసం వేలాది ఎకరాల భూములిచ్చినా రైతుల పొలాలకు నీరు అందడం లేదు. నాయకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం రైతులకు శాపంగా మారింది. గత ప్రభుత్వం సాగునీటి అవసరాల కోసం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసింది. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా లక్ష ఎకరాలకు వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. ప్రధాన కాల్వల నిర్మాణం జరిగినా.. సబ్ కెనాల్స్ నిర్మాణం పూర్తికాలేదు. దీంతో నీళ్లున్నా రైతులు తమ పంట పొలాలకు నీరు పారించలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన కాలువల్లో ఉన్న మట్టి పూడికను, తుంగను రైతులే తొలగించారు. చెరువులను నింపుడం కోసం రైతులే కాలువలు తవ్వుకుంటున్నారు. ప్రణాళిక బద్ధంగా నీటిని విడుదల చేయకపోవడంతో చివరి అయకట్టుకు వరకు సాగునీరు అందడం లేదు
సబ్ కెనాల్స్కు అడ్డంకిగా భూసేకరణ
సబ్ కెనాల్స్ (Sub Canals) నిర్మాణానికి భూసేకరణ సమస్య అడ్డుగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో కొన్ని కాల్వల కోసం భూసేకరణ చేసినా నష్టపరిహారం విషయంలో రైతులతో ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు చెబుతున్నారు. భూసేకరణపై పూర్తిస్థాయిలో జరిగితేనే కాలువల నిర్మాణ పనులు పూర్తిచేయడం సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అలాగే ఇర్కోడు ఎత్తి పోతల పథకం నిర్మాణానికి నిధులున్నా పంప్ హౌస్ పనులు పూర్తి చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొగుట మండలం ఎల్లారెడ్డిపేట వద్ద ఉన్న పంపుహౌస్ పనులు పూర్తి చేయకపొవడంతో దుబ్బాక రైతులు నష్టపోతున్నారు
ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక నియోజకవర్గ నీటి సమస్య పరిష్కారం కోసం అసెంబ్లీలో సైతం తాను ప్రస్తావించానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నాడు. గత ప్రభుత్వంలో కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల ద్వారా నీరందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సాగునీటిపై ఉలుకు పలుకు లేదని ఆయన విమర్శించారు. ఉప కాల్వల పనులు పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

