కలం, కరీంనగర్: పెద్దపల్లి (Peddapalli) జిల్లా మంథని (Manthani) ఫ్లైఓవర్పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో బొలెరో వాహనం నడుపుతున్న (Drunk Driving) డ్రైవర్ అదుపు తప్పి ముందుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు. అనంతరం ఎదురుగా వస్తున్న కారును సైతం బలంగా ఢీకొనడంతో ఘటనాస్థలంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు పలువురు గాయపడ్డారు. సుల్తానాబాద్ నుంచి ఓడేడు వైపు వెళ్తున్న వాహనంలో ప్రయాణిస్తున్న ఓడేడుకు చెందిన రామగిరి వెంకటలక్ష్మి, మొండయ్య, రామకృష్ణ గాయపడగా, అదృష్టవశాత్తూ వారికి ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు.
సమాచారం అందుకున్న కమాన్పూర్ 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా మంథని ఫ్లైఓవర్పై సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. మద్యం మత్తులో వాహనం నడిపిన బొలెరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

