కలం, భువనగిరి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే (Bhuvanagiri MLA) కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల నూతన మార్కెట్ గోదాం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రేఖా బాబురావుతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు ఈ నూతన గోదాం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
“సరైన నిల్వ సదుపాయాలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి ప్రభుత్వం ఈ ఆధునిక గోదాముల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ గోదాం పూర్తయితే 2,500 మెట్రిక్ టన్నుల పంటను శాస్త్రీయ పద్ధతిలో దాచుకోవచ్చు. మార్కెట్లో మంచి ధర వచ్చే వరకు రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడ భద్రపరుచుకోవచ్చు. ఇది గూడూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.” అని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వివరించారు.
వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే కుంభం
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీరు, గోదాములు, మార్కెట్ యార్డుల అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రేఖా బాబురావు, వివిధ సొసైటీల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, భువనగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

