కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, మణుగూరు మండలంలోని కొండాయిగూడెం గ్రామస్తులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల దాహం తీర్చాల్సిన ఆర్వో ప్లాంట్ నెల రోజులుగా పని చేయడంలేదు. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ప్రయోజనం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సామాజిక బాధ్యతలో భాగంగా తాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుచేసింది. గంటకు 250 లీటర్ల నీటిని అందించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, సాంకేతిక లోపంతో నెల రోజులుగా పనిచేయడం లేదు. దాదాపు 300 కుటుంబాలకు ఉపయోగపడే ఈ వాటర్ ప్లాంట్ ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది.
ప్రజలు పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “సింగరేణి ఖర్చు చేస్తున్న నిధులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. ఆర్వో ప్లాంట్ నిరుపయోగంగా మారడంతో తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రోజువారీ అవసరాలకూ నీరు దొరకడం (Water Crisis) కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్వో ప్లాంట్ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

