కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో పలు చోట్ల మళ్లీ డీజిల్ (Diesel) కొరతలు ప్రారంభమయ్యాయి. కూకట్పల్లిలో పలు పెట్రోల్ బంకులను ఇప్పటికే మూసివేశారు. పెట్రోల్ సరఫరా బాగానే జరుగుతున్నా.. డీజిల్ మాత్రం సరఫరా తగ్గింది. దీంతో బంకుల వద్ద ‘డీజిల్ నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు వస్తుందని బంకు సిబ్బందిని ప్రశ్నిస్తే.. తమకు తెలియదని చెబుతున్నారు. దీంతో, డీజిల్ దొరికే బంకుల వద్దకు పరుగులు తీస్తుండటంతో.. అక్కడ వాహనాల రద్దీ భారీగా పెరిగింది.
ప్రభుత్వం మాత్రం మరోలా..
హైదరాబాద్ నగరంలో డీజిల్ కొరత వార్తలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్రం కొట్టి పారేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ కలిపి మొత్తం 24 వేల కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్ బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నామని వివరించింది. తప్పుడు ప్రచారం నమ్మొద్దని వాహనదారులకు సూచిస్తోంది. అయితే, బంకుల్లో మాత్రం నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ పరిస్థితిపై సమీక్షించే అవకాశం ఉందని సమాచారం.

