కలం వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడంపై డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల స్థాపన దిశగా మరో ముందడుగు పడిందని డీజీపీ పేర్కొన్నారు. హింసా మార్గాన్ని వీడి, ప్రభుత్వంపై నమ్మకంతో 47 మంది మావోయిస్టులు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. వీరి నుంచి 32 తుపాకులు, 515 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సంస్కరణల పట్ల నమ్మకంతోనే వీరంతా జనజీవన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్నారని, ఇది రాష్ట్ర పోలీసుల పునరావాస కార్యక్రమాల విజయానికి నిదర్శనమని డీజీపీ పోస్ట్లో పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డీజీపీ స్పష్టం చేశారు. విధుల పట్ల అంకిత భావంతో పని చేసిన పోలీస్ బృందాలను అభినందించారు. ఇంకా ఎవరైనా మావోయిస్టులు అజ్ఞాతంలో ఉంటే వారు కూడా లొంగిపోవాలని కోరారు.

