కలం, నల్లగొండ బ్యూరో: ఆర్యవైశ్య సమాజానికి ఎలాంటి సమస్యలు ఉన్నా.. ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి అండగా నిలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) హామీ ఇచ్చారు. నల్లగొండ (Nalgonda) పట్టణంలోని బీట్ మార్కెట్ రామకోటి స్తూప దేవాలయం, గాంధీ పార్క్లో నిర్వహించిన వాసవి మాత జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం వాసవి మాతను దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. వాసవి మాత ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
రామకోటి స్తూప దేవాలయ అభివృద్ధికి గతంలో అన్ని విధాలుగా సహకారం అందించినట్లు తెలిపారు. దేవాలయ విస్తరణకు అవసరమైన స్థలాన్ని కూడా సమకూర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

