కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ – అలైవ్’ (Arrive – Alive) రోడ్డు భద్రత వారోత్సవాల 5వ రోజు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) గురువారం కరీంనగర్ చేరుకున్నారు. ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు భద్రత అవగాహన సదస్సులలో భాగంగా శుక్రవారం కరీంనగర్లో నిర్వహించే జిల్లా స్థాయి భారీ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గురువారం కరీంనగర్ చేరుకున్న డీజీపీకి జిల్లా పోలీసు యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. రాత్రికి ఇక్కడే బస చేయనున్న ఆయన రేపు ఉదయం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అనంతరం రోడ్డు భద్రతపై ఏర్పాటు చేసిన సదస్సులో ప్రజలను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో పోలీసు శాఖ పాత్రను ఆయన వివరించనున్నారు. రేపు జరగనున్న ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.

