కలం, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంగా 2024 జనవరి ఫస్ట్ న మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకున్నది. షెడ్యూలు ప్రకారం మార్చి 31న ఈ ఆపరేషన్ కంప్లీట్ కానున్నది. ఆ తర్వాత ‘మావోయిస్టు రహిత దేశం’ అని ప్రకటించాలన్నది కేంద్ర ప్రభుత్వ టార్గెట్. కానీ తెలంగాణ (Telangana) డీజీపీ శివధర్రెడ్డి (DGP Shivadhar Reddy) మాత్రం నెల రోజుల ముందుగానే ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’ అని ప్రకటించేశారు. ఇలాంటి ప్రకటన చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఈ రాష్ట్రంలో ఐదు దశాబ్దాల క్రితం పుట్టిన పార్టీ తొలుత కంప్లీట్గా కనుమరుగైంది కూడా ఈ గడ్డమీదనే అని ప్రకటించడం గమనార్హం. తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాలన్నీ ముగిసినట్లు స్పష్టం చేశారు. ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభం, రాష్ట్రంలో యాక్టివిటీస్ తగ్గిపోవడం, కొత్త రిక్రూట్మెంట్లు ఆగిపోవడం.. వీటన్నింటితో తెలంగాణలో మావోయిస్టు పార్టీ ఇక ఒక చరిత్రగానే మిగిలిపోనున్నది.
అగ్రనాయకత్వంపైనే ఇంటెలిజెన్స్ ఫోకస్ :
మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో ఉమ్మడి రాష్ట్రం ఉనికిలో ఉన్నప్పటి నుంచీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోషించిన పాత్ర కీలకమైనది. కోవర్టు ఆపరేషన్లు, సరెండర్లు, కూంబింగ్లు, ఎన్కౌంటర్లు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి.. ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలతో ఆ పార్టీ ప్రాభవాన్ని తగ్గించడంలో సక్సెస్ అయింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) ఫోకస్ మొత్తం పార్టీ అగ్ర నాయకత్వంపైనే. ఇప్పటివరకు ఎస్ఐబీ తొమ్మిది మంది కేంద్ర కమిటీ సభ్యులను ఎన్కౌంటర్లలో హతమార్చగా, మరో ఏడుగురు లొంగిపోయేలా చేసింది. ఏడుగురిని అరెస్టు చేసింది. ఇప్పటిదాకా లీడర్లు, కేడర్ అంతా కలిపి మొత్తం 14,078 మందిని అరెస్టు చేసింది. మరో 5,865 మంది మావోయిస్టులు లొంగిపోయేలా చేయగలిగింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న 1,057 ఎన్కౌంటర్లలో 1,289 మంది హతమయ్యారు. ఇతర రాష్ట్రాల పోలీసులకు కూడా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తెలంగాణ ఎస్ఐబీ పాత్ర కీలకం.
Read Also: ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హరీశ్ రావు
Follow Us On: Youtube

