కలం, హైదరాబాద్ : థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో నిర్వహించిన 12వ తిరాక్ ఇంటర్నేషనల్ టైక్వాండో టోర్నమెంట్–2026లో భారత యువ క్రీడాకారుడు అర్మాన్ నజీముద్దీన్ అద్భుత ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అర్మాన్ సాధించిన ఈ అంతర్జాతీయ విజయాన్ని డీజీపీ సి.వి. ఆనంద్ (DGP CV Anand) అభినందించారు. ఈ విజయంతో అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు. బ్యాంకాక్లోని ఫ్యాషన్ ఐలాండ్ హాల్లో నిర్వహించిన ఈ పోటీలలో కియోరూగి (స్పారింగ్) విభాగంలో పాల్గొన్న అర్మాన్, 12–14 సంవత్సరాల (కేడెట్) వయో విభాగం, క్లాస్–బి డివిజన్, 41–45 కిలోల బరువు విభాగంలో పోటీ చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు.
పోటీ అంతటా అత్యుత్తమ నైపుణ్యం, క్రమశిక్షణ, పోరాట పటిమను ప్రదర్శించి విజేతగా నిలిచాడు. అర్మాన్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. ఆయన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి కాగా, కవితా టైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇప్పటికే కొరియా కుక్కివోన్ సంస్థ నుంచి బ్లాక్ బెల్ట్ డాన్–2 అర్హతను పొందడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. అర్మాన్ ను డీజీపీ సి.వి. ఆనంద్ అభినందించారు. అర్మాన్ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. అర్మాన్ నజీముద్దీన్ సాధించిన ఈ ఘన విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

