కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలంగాణలోని హన్మకొండకు చేరుకున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ (16) కోరికను తీర్చడానికి ఆయన స్వయంగా తరలివచ్చారు. హన్మకొండ పరిధిలోని హనుమాన్ నగర్లో ఉన్న నిరంజన్ నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు జనసేన నాయకులు, కార్యకర్తలు స్థానిక అభిమానులు ఘన స్వాగతం పలికారు.
హనుమాన్ నగర్లోని నిరంజన్ ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్, మంచంపై ఉన్న బాలుడిని ఆప్యాయంగా పరామర్శించారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్, ఇటీవలే టీవీలో చూసి పవన్ కళ్యాణ్ను కలవాలనే తన బలమైన కోరికను వ్యక్తపరిచాడు.
ఈ విషయం సోషల్ మీడియా, జనసేన నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా మానవతా దృక్పథంతో స్పందించి హన్మకొండకు విచ్చేశారు. నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పర్యటన నేపథ్యంలో హన్మకొండలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంజన్ పరామర్శ అనంతరం వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు.

