కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంధనం కొరతపై పుకార్లు వస్తున్న వేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రజలకు కీలక సూచనలు చేశారు. బుధవారం శాసన మండలి సమావేశపు హాలులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లతో కలిసి గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ నిల్వలు, పంపిణీలు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. అపోహలు, పుకార్లు కలిగించే మాధ్యమాల కథనాలతో ఆందోళనకు గురి కావద్దని ప్రజలకు భట్టి (Deputy CM Bhatti Vikramarka) సూచించారు.
వినియోగదారులు రోజువారీగా కొనుగోలు చేసే దానికంటే, ఎక్కువగా ఇంధనాన్ని నిల్వ చెయొద్దని కోరారు. బంకుల దగ్గరకు వచ్చే చివరి వాహనాదారుడికి కూడా పెట్రోల్, గ్యాస్ దొరుకుతుందనే భరోసా కల్పించాలని అధికారులకు, ఏజెన్సీలకు భట్టీ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు నమ్మకాన్ని కల్పించడానికి ప్రతిరోజు మీడియా ద్వారా వివరణ ఇవ్వాలన్నారు. గ్యాస్, ఫ్యూయల్ ను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తందని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీపీ సజ్జనార్, సుధీర్ బాబు, ఆయిల్ ఏజెన్సీల ప్రతినిదులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

