కలం, వెబ్ డెస్క్: ఇందిరమ్మ ఇండ్లపై ప్రతిపక్షాలు చేసేదంతా తప్పుడు ప్రచారమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రతిపక్షాలు బడ్జెట్ ప్రతులను చింపి వేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదల సంక్షేమం కోసం మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు కనీసం వినే పరిస్థితిలో కూడా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు ప్రభుత్వం ఇళ్లు ఇస్తుంటే విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే రూ.5 వేల కోట్లు చెల్లించినట్లు భట్టి వెల్లడించారు. ప్రతి వారం బిల్లులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గానికి 3500 ఇళ్ల లెక్కన 4.5 లక్షల ఇండ్లు సాంక్షన్ చేస్తున్నామని ప్రకటించినట్లు భట్టి గుర్తు చేశారు. దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను, అధికారులను, జిల్లా అధికార యంత్రాంగాన్ని, హౌసింగ్ శాఖను అనేక సార్లు సమావేశాలు పెట్టి అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన వారందరికీ ఇండ్లు అందేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇండ్ల నిర్మాణానికి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే.. పేద వాళ్ల కోసం ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పామన్నారు. గత ప్రభుత్వం లాగా డబుల్ బెడ్ రూం ఇండ్లు అని మాటలు చెప్పి, పదేళ్లు అధికారంలో ఉండి పేద వాళ్లను గాలికి వదిలేసే ప్రభుత్వం తమది కాదని విమర్శించారు. హౌసింగ్ శాఖతో ఇండ్లపై స్పష్టంగా రివ్యూ చేస్తూ వారానికి ఒకసారి బిల్లులు విడుదల చేస్తున్నామన్నారు. ఇల్లు కట్టండి.. బిల్లు పెట్టండి అని పేద వాళ్లకు పదే పదే చెప్తూ నిర్మాణాలు పూర్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ పేద వాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్న ఉన్నత ఆశయంలో రూ.25 వేల కోట్లు ఖర్చవుతున్నా, ప్రభుత్వానికి భారమవుతున్నా, ఇండ్లు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నామన్నారు. ఇంత గొప్పగా పని చేస్తుంటే అభినందించాల్సింది పోయి, ఇళ్లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.

