కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో అర్ధరాత్రి వేళ ఘోర విషాదం చోటుచేసుకుంది. రోహిణి ప్రాంతంలోని బుద్ధ్ విహార్ మురికివాడ సమీపంలో ఉన్న ఒక ఓపెన్ గ్రౌండ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ మెటీరియల్తో నిండి ఉన్న ఈ ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.25 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిల్వ ఉంచిన స్క్రాప్ వస్తువులకు మంటలు అంటుకోవడంతో అవి వేగంగా వ్యాపించి గ్రౌండ్ మొత్తాన్ని చుట్టేయడంతో లోపల ఉన్న వారు తప్పించుకోలేక మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారి అజయ్ శర్మ మాట్లాడుతూ.. మంటలను ఆర్పే క్రమంలో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారని, అయితే దురదృష్టవశాత్తు అప్పటికే ముగ్గురు చనిపోయారని తెలిపారు. మృతులు మినహా ఇతరులెవరికీ గాయాలు కాలేదని ఆయన తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

