కలం, వెబ్ డెస్క్: షికోపూర్ భూముల కొనుగోలుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra)కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ వాద్రాను అరెస్ట్ చేయకుండా కోర్టులోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. శనివారం జరిగిన విచారణలో ప్రత్యేక న్యాయమూర్తి సుశాంత్ చంగోత్రా స్పందిస్తూ.. రూ.50,000 పూచీకత్తుపై రాబర్ట్ వాద్రాకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ ఆన్లైన్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో తాము ప్రస్తుత పరిస్థితిపై స్టేటస్ రిపోర్టును సమర్పిస్తున్నామని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మరో రెండు వారాల సమయం కావాలని కోర్టును కోరారు. అలాగే, ఈ కేసులో ఈడీ దర్యాప్తును పరిగణలోకి తీసుకోవడాన్ని నిందితులు ఇప్పటికే కోర్టులో సవాలు చేశారని ఆయన న్యాయమూర్తికి వివరించారు.

