కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించాలని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Dattatreya) డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది జరిగే శతజయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఆయనకు నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. కొమురయ్య త్యాగం, పోరాటస్ఫూర్తిని పాఠ్యాంశాల్లో చేర్చి యువతకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి వేడుకల్లో దత్తాత్రేయ మాట్లాడారు. రాష్ట్రంలో కురుమ సామాజిక వర్గం జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారని, వచ్చే ఎన్నికల నాటికి కనీసం తొమ్మిది మంది అసెంబ్లీలోకి రావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ జనగామ జిల్లాకు, అలాగే ప్రతిపాదిత విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

