కలం, హనుమకొండ: కుడా భూ వేలాన్ని (KUDA Land Auction) ప్రశ్నిస్తున్నందుకు వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinaya Bhaskar) ఆరోపించారు. భద్రకాళి ఆలయం వద్ద కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఎలాంటి నిరసన పిలుపు ఇవ్వని తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
కుడా లేఔట్ భూముల వేలం ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని, పేదలకు దక్కాల్సిన భూములను పెద్దలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఫార్మసిస్టులు, డాక్టర్లు, ఎన్నారైలను బెదిరించి వేలంలో పాల్గొనకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. గజానికి రూ.1.50 లక్షల వరకు మార్కెట్ విలువ ఉన్న భూమిని సిండికేట్గా వ్యవహరించి కేవలం రూ.60 వేల నుంచి రూ.65 వేలకే కట్టబెట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేకుండా భారీ అవినీతి జరిగిందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కంటే అవినీతి పెరిగిందని, ఆన్లైన్లో నిర్వహించాల్సిన టెండర్లను ఆఫ్లైన్లో నిర్వహిస్తూ కమిషన్ దందాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కుడా భూ వేలంలో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబితే వెంటనే ఆ వేలం రద్దు చేసి, పూర్తి పారదర్శకతతో ఆన్లైన్ విధానంలో మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగమే అమలవుతోందని వినయ్ భాస్కర్ విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తగిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

