కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ నాయకత్వ లక్షణాలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఆదర్శమని ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) అన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్లు అని.. వారు బలంగా ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురం డివిజన్ జీఎస్ఆర్ (GSR) గార్డెన్స్లో నిర్వహించిన “నా బూత్ – నా భవిష్యత్తు” బూత్ లెవెల్ ఏజెంట్స్ (BLA) శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంత వ్యవస్థీకృతంగా, కార్యకర్తలను రాజకీయంగా, సాంకేతికంగా, భావజాల పరంగా బలోపేతం చేసేలా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అభినందించారు.
తమ బూత్కు తామే బాధ్యులుగా ఉంటూ ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన పెంచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. నిరంతర అధ్యయనమే నాయకత్వానికి అత్యవసరమని చెప్పారు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా (ఫేస్బుక్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్) వేదికగా ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉండాలని సూచించారు. రాజకీయాల్లో సిద్ధాంత నిబద్ధతతో పాటు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. కార్యకర్తలంతా నిత్యం వ్యాయామం, ధ్యానం చేస్తూ, కుటుంబానికి కూడా తగిన సమయం ఇవ్వాలని దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సూచించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
Read Also: గురుకులాల్లో వసతులు అందించడమే మా లక్ష్యం: భట్టి
Follow Us On : WhatsApp

