కలం, వెబ్ డెస్క్ : సైబరాబాద్ పరిధిలో జూన్ 22 సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ (Cyberabad Police) అలర్ట్ అయింది. వర్షాల కారణంగా రహదారులపై తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, ఉద్యోగుల భద్రత, అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ తమ పరిధిలోని కంపెనీలకు కీలక సూచన చేసింది. జూన్ 22న మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఉద్యోగులకు దశలవారీగా ముందస్తు సెలవులు ఇవ్వాలని సంస్థలను కోరింది.
దీంతో వర్షాల సమయంలో ప్రయాణ సంబంధిత ప్రమాదాలు తగ్గడంతో పాటు, రహదారులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ మేరకు అత్యవసర సేవలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్రజలు, సంస్థలు ఈ సూచనలను పాటించి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

