కలం, వరంగల్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. బాధితుల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటూ డబ్బులను కొల్లగొడుతున్నారు. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలో గురువారం ఇలాంటి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహబూబాబాద్ పట్టణంలోని కంకర బోడు ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలికి సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. మీపై కేసు నమోదు చేశామని, అరెస్టు వారెంట్ పెండింగ్లో ఉందని భయపెట్టారు. కేసు నుంచి బయట పడాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విడతల వారీగా..
కేటుగాళ్ల మాయలో పూర్తిగా పడిపోయిన సదరు ఉపాధ్యాయురాలి నుంచి విడతల వారీగా సుమారు రూ. 82 లక్షలు తమ అకౌంట్లకు బదిలీ చేయించుకున్నారు. తరువాత, కేసు విషయమై వారిని సంప్రదించే ప్రయత్నం చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

