కలం, వెబ్ డెస్క్: చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ (RCB) విధ్వంసం బ్యాటింగ్తో ఆగలేదు.. బౌలింగ్లోనూ సీఎస్కే (CSK) నడ్డి విరిచింది! 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ పేసర్ల ధాటికి కేవలం 3 ఓవర్లలోనే 30 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ముఖ్యంగా జాకబ్ డఫ్ఫీ తన స్పెల్తో చెన్నై బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. విధ్వంసకర బ్యాటర్ సంజు శామ్సన్ (9) కేవలం 5 బంతుల్లో ఒక సిక్సర్ కొట్టి టచ్లోకి వచ్చినట్లే కనిపించి, డఫ్ఫీ వేసిన బంతికి స్లిప్లో పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) సైతం డఫ్ఫీ బౌలింగ్లోనే పడిక్కల్కే క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు.
మరోవైపు, టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆయుష్ మ్హాత్రే (1) వికెట్ తీయడం ద్వారా భువీ ఐపీఎల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి పేసర్గా రికార్డు సృష్టించాడు. భువీ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయలేక మ్హాత్రే మిడ్ ఆఫ్ వద్ద పాటిదార్కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్ (12), కార్తీక్ శర్మ (0) ఉన్నప్పటికీ, ఆర్సీబీ బౌలర్ల జోరు చూస్తుంటే చెన్నైకి ఈ మ్యాచ్లో కోలుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. 10 రన్ రేట్తో ఆడుతున్నా, లక్ష్యం కొండంత ఉండటంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం ఆర్సీబీ నినాదాలతో హోరెత్తిపోతోంది.

