కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ‘స్పోర్ట్స్ హబ్’ (Sports Hub) బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బోర్డు సభ్యులు ఉపాసన కొణిదెల, కావ్య మారన్, సంజీవ్ గోయెంకా, సి.శశిధర్, జయేష్ రంజన్, స్పోర్ట్స్ ఎండీ సోనీ బాల దేవి వంటి కీలక సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం పునః నిర్మాణానికి జూన్ 2న శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్లో ఒలింపిక్స్ను నిర్వహించే స్థాయిలో స్టేడియం ఉండాలని, చైనాలోని క్రీడా సదుపాయాల కంటే మెరుగైన మౌలిక వసతులను కల్పించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా స్టేడియం వద్ద హెలీప్యాడ్తో పాటు, విమానాశ్రయం నుంచి క్రీడాకారుల కోసం నేరుగా హెలీకాప్టర్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో నిధుల కొరత రాకుండా దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేయాలని, దీని అమలులో బోర్డుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే స్టేడియంలో భారీ తెరలు, ఇతర ఆకర్షణలను ఏర్పాటు చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులను, ప్రజలను పెద్ద ఎత్తున ఆకట్టుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ను కూడా నియమించినట్లు వెల్లడించారు.

