కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక వింత ఘటన చోటు చేసుకున్నది. నిన్న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో తమ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు క్షుద్ర పూజలకు పాల్పడ్డారని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఒక లేఖ రాశారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్యాలరీలోని ఒక విభాగం ప్రేక్షకులు బ్లాక్ మ్యాజిక్ వంటి తాంత్రిక విద్యలను ప్రదర్శించారని, చేతులతో వింత సంజ్ఞలు చేస్తూ నిమ్మకాయతో వింత ఆచారాలు నిర్వహించారని సీఎస్కే తన లేఖలో పేర్కొంది. సరిగ్గా ఆ ఘటనలు జరిగిన వెంటనే తమ ఆటగాళ్ల ప్రదర్శనలో అకస్మాత్తుగా మార్పు వచ్చిందని, ఆటపై పట్టు కోల్పోయి వింత రీతిలో అవుట్ అయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ అనేది నైపుణ్యంతో కూడిన క్రీడ అని, ఇలాంటి మూఢనమ్మకాలకు స్టేడియంలో చోటు ఉండకూడదని వారు స్పష్టం చేశారు. వెంటనే స్టేడియంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, ఇలాంటి పనులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఆటగాళ్ల మానసిక స్థితిని దెబ్బతీసే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని బీసీసీఐని కోరారు. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

