కలం, హనుమకొండ : అధిక ధరల భారం నుంచి ప్రజలను ఉపశమనం కల్పిస్తారా… లేక అధికారాన్ని వదులుకుంటారా అంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీపీఐ (CPI) రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ధరల నియంత్రణకు డిమాండ్ చేస్తూ బుధవారం హనుమకొండ (Hanumakonda) కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై భారాన్ని మోపిందని, తాజాగా వంట గ్యాస్ ధరలు పెంచడం ద్వారా పేదలపై మరింత భారం వేసిందని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని, అయితే వాటిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు జీవించలేని స్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయని కారణం చూపుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం సమంజసం కాదని ప్రశ్నించారు. వంట గ్యాస్తో పాటు కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతూ ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు.
ధరలు ఇలాగే కొనసాగితే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: నెహ్రూను తక్కువ చేస్తే చరిత్రను అవమానించినట్టే: మంత్రి పొన్నం
Follow Us On: Sharechat

