కలం, హనుమకొండ: ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో హనుమకొండ (Hanumakonda) కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం శనివారం ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులతో కలిసి కలెక్టరేట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరసనకు నాయకత్వం వహించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో (Kunamneni Sambasiva Rao) పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు వాహనాలలో సమీప స్టేషన్కు తరలించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

