కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని సెక్రటేరియట్లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సీపీఐ ప్రతినిధి బృందం (CPI Leaders) సమావేశమైంది. ఈ మీటింగ్కి కూనంనేనితోపాటు సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, పశ్య పద్మ, ఈ.నరసింహ, చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాగం హేమంతరావు, శంకర్, బాల నరసింహ, వీఎస్ బోసు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్టంలోని కార్మికుల కనీస వేతనాల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీపీఐ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లపై సైతం సీఎం చర్చించారు. సీపీఐ నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేంద్రం సహకరించక పోయినా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మొక్క జొన్న దిగుబడి బాగా వచ్చిందని అన్నారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని.. ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్క జొన్న కొనుగోలు చేస్తున్నామని అన్నారు.
ఇటీవల రాష్ట్రంలోని ఒక కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలను (Minimum Wage Hike) పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కార్మికులను నాలుగు కేటగిరీలుగా విభజించి ఆ ప్రాతిపదికన వేతనాలను పెంచినట్టు తెలిపారు. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్గా 4 విభాగాలుగా విభజించినట్టు చెప్పారు.
అన్స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుత వేతనం రూ. 12,750 నుంచి రూ. 16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుత వేతనం రూ. 13,592 నుంచి రూ. 17 వేలకు, స్కిల్డ్ కార్మికులకు రూ. 13,772 నుంచి రూ. 18,500 లకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ. 14,607 నుంచి రూ. 20 వేలకు పెంచినట్టు సీఎం ప్రకటించారు. ఈ పెంచిన వేతనాలు వచ్చే జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలులోకి వస్తాయని చెప్పారు.

