కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ళ వెంకటి తన తుది శ్వాస విడిచే వరకు సీపీఐ పార్టీలో కొనసాగారని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) అన్నారు. ఆయన మృతి సీపీఐకి, వారి కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సీపీఐ నేతలతో కలిసి వెంకటరెడ్డి కుందేళ్ళ వెంకటి కుటుంబాన్ని పరామర్శించి వెంకటి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకటి చిన్నతనం నుండే భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారని, పార్టీ పట్ల అంకిత భావంతో ఉండేవారని అన్నారు. ఎవరెన్ని పార్టీలు మారినా ఆయన మాత్రం చివరి శ్వాస విడిచే వరకు ఎర్రజెండాను వీడలేదని కొనియాడారు. ప్రజా సమస్యలపై సీపీఐ నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని, పార్టీ బలోపేతం కోసం గ్రామంలో కృషి చేశాడని అన్నారు.
అలాంటి క్రమశిక్షణ కలిగిన వెంకటి మృతి చెందడం అత్యంత బాధాకరమని, వారి కుటుంబానికి సీపీఐ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు వెంకటరెడ్డి ధైర్యం చెప్పారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వెంకటికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, వారి ఇల్లు శిథిలావస్థలో ఉందన్నారు. వారికి ఇల్లు మంజూరు చేయాలని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, అందె చిన్న స్వామి, బూడిద సదాశివ, సీపీఐ, గ్రామ కార్యదర్శి అందె సంపత్, సీతారాంపూర్ మాజీ సర్పంచ్ గోలీ బాపురెడ్డి, సీపీఐ సీనియర్ నాయకులు బండారుపెల్లి తిరుపతి, తాళ్ళపెల్లి చంద్రయ్య, ఎలగందుల రాజు, గందె కొమురయ్య, గంట వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

