కలం, జనగామ : పెట్రోల్, డీజిల్ ధరలపై మూడు రూపాయలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న డిమాండ్ చేశారు. శనివారం జనగామ పట్టణ అంబేడ్కర్ కూడలి ఎదుట సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ జనగామ (Jangaon CPI) పట్టణ కార్యదర్శి సొప్పరి సోమయ్య అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆది సాయన్న మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒకప్పుడు రూ. 55లుగా ఉన్న పెట్రోల్ ధరను ప్రస్తుతానికి రూ. 113కు చేరిందని విమర్శించారు. దేశంలో అందరికీ సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే ధరలను పెంచడం దారుణమన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజలపై పెట్రో భారాన్ని మోపి, ఒక చేదు కానుకను ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో మోటే శ్రీశైలం, చామకూర యాకూబ్, జయ నాగేష్, మురారికర్ సుదర్శన్, ఉప్పల ఐలయ్య, బెజగం చంద్రయ్య, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

