కలం, ఖమ్మం బ్యూరో : తప్పుడు ప్రచారాలు చేసే వార్తా ఛానళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ (CPI) జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా డిమాండ్ చేశారు. కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుపై ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్లు ఒక ఛానల్లో వచ్చిన వార్తలపై ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలో ఒక ప్రకటన విడుదల చేశారు.
గత నాలుగున్నర దశాబ్దాలుగా ఎలాంటి మచ్చ లేకుండా ప్రజల పక్షాన నిలబడి నిరంతరం శ్రమిస్తున్న నిజాయితీ గల నాయకుడు కూనంనేని సాంబశివరావు అని కొనియాడారు. నిరాధారమైన ఆరోపణలతో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయడం తగదని, కూనంనేని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడం శోచనీయమన్నారు.
కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జికి తానేమీ ఫిర్యాదు చేయలేదని ఎంపీ రఘురాం రెడ్డి స్వయంగా ప్రకటించారని, ఛానళ్లలో తప్పుడు వార్తలు రావడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. ఇప్పటికైనా మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు.

