కలం, కరీంనగర్ బ్యూరో : మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిల వల్ల గానీ, మరే ఇతర వేధింపుల వల్ల గానీ ఇబ్బందులు ఎదుర్కుంటుంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని జిల్లా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Goush Alam) సూచించారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ విభాగాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని సీపీ హామీ ఇచ్చారు.
సామాజిక మాధ్యమాలలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలని సూచించారు. మే లో జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ద్వారా 8 క్రిమినల్ కేసులు, 19 పెట్టీ కేసులు నమోదు చేశామని, 70 హాట్స్పాట్లపై నిఘా ఉంచి 35 మంది పోకిరిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు 8712670759 నంబర్కు గానీ, డయల్ 100/112 కు గానీ సంప్రదించాలని, అలాగే ఒంటరి ప్రయాణాల్లో భద్రత కోసం T-SAFE యాప్ వినియోగించుకోవాలని సీపీ కోరారు.

